జగన్, కోడెల పోటాపోటీ ధర్నా
వ్యాట్ పై రాజకీయ పార్టీల పోరు గుంటూరు జిల్లాలో వేడిపుట్టిస్తోంది. వస్త్ర వ్యాపారులు చేస్తున్న సమ్మెకు మద్దతుగా అటు జగన్, ఇటు TDP ధర్నాలకు దిగుతుండటంతో వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. ఇరు పార్టీల నేతలు పోటాపోటీగా ధర్నాకు ఏర్పాట్లు చేస్తుండటంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.
మరోవైపు ముందే అప్రమత్తమైన పోలీసులు వ్యాపారులతో పాటు పార్టీ నేతలతో చర్చించి మధ్యే మార్గాన్ని సూచించారు. వస్త్ర వ్యాపారులకు మద్దతుగా వైఎస్సార్ కాంగ్రెస్, టిడిపిలు తలపెట్టిన ధర్నాలు గుంటూరు జిల్లా నరసరావుపేటలో రాజకీయ వేడిపుట్టిస్తున్నాయి. ఇరు పార్టీల నేతలు ధర్నాకు పోటాపోటీగా ఏర్పాట్లు చేస్తుండటంతో పరిస్థితులు ఉద్రిక్తంగా మారుతున్నాయి.
వస్త్రాలపై ప్రభుత్వం విధించిన 5 శాతం వ్యాట్ కు నిరసనగా బంద్ పాటిస్తున్న వస్త్ర వ్యాపారులు నాలుగు రోజులుగా శివుని బొమ్మ సెంటర్లో దీక్షలు చేస్తున్నారు. వారికి మద్దతుగా జగన్ ధర్నాకు సిద్దమయ్యారు. జిల్లా టిడిపి నేతలు సైతం వ్యాట్ కు నిరసనగా ధర్నా చేయనున్నారు. అయితే ఇరు పార్టీల ధర్నాలు ఒకరోజు కావడంతో నరసరావుపేటలో వాతావరణం ఒక్కసారిగా హీటెక్కింది.
అయితే ఎంజిల్ టాకిస్ సెంటర్లో జగన్ ధర్నా కు వైఎస్సార్ సీపీ నేతలు ఏర్పాట్లు చేస్తుండగా, శివమ్మ బొమ్మ చౌక్ లో ధర్నాకు తెలుగు తమ్ముళ్లు సన్నాహాలు చేస్తున్నారు. వ్యాపారులకు మద్దతుగా శుక్రవారం దీక్ష చేస్తామని ముందే చెప్పామని, అందులో భాగంగానే తాము ధర్నాలో పాల్గొంటామని టిడిపి నేతలు కోడెల శివప్రసాద్, ఎంపీ మోదుగుల వేణుగోపాల్ రెడ్డి తెలిపారు.
ఓ పార్టీ అధ్యక్షుడి హోదాలో జగన్ వ్యాపారుల దీక్షలో పాల్గొంటే తమకేమి అభ్యంతరం లేదని ప్రకటించారు. అటు వైఎస్సార్ సీపీ నేతలు మాత్రం మరోలా వాదిస్తున్నారు. వస్త్ర వ్యాపారుల కోసం జగన్ తలపెట్టిన ధర్నాకు అంతరాయం కల్గించటానికే టిడిపి కుట్ర చేస్తోందని ఆరోపించారు.
అయితే పరిస్థితి ఉద్రిక్తంగా మారుతుండటంతో కలవరపడ్డ పోలీసులు మధ్యేమార్గాన్ని ప్రతిపాదించారు. వ్యాపారులతో పాటు ఇరు పార్టీల నేతలతో చర్చించిన జిల్లా ఎస్పీ రవిచంద్ర శివమ్మ బొమ్మ సెంటర్లో టిడిపి, ఎంజెల్ టాకీస్ వద్ద జగన్ ధర్నా చేసే విధంగా అంగీకరింపచేశారు. దీంతో ఉదయం టిడిపి.
మద్యాహ్నాం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలు ఆందోళన చేసుకునేలా కార్యక్రమాలను రూపొందించారు. మరోవైపు రాజకీయ పార్టీల పోటాపోటీ ధర్నాలతో నరసరావుపేటలో ఎలాంటి అవాంచనీయ ఘటనలు జరగకుండా పోలీసులు చర్యలు చేపట్టారు.